శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు అనుగ్రహం పొందిన రోజు

२० ऑगस्ट १९६५ को लिया गया चित्र

 

శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు అనుగ్రహం పొందిన రోజు

విశ్వవసు నామ సంవత్సరం – శ్రావణ కృష్ణ అష్టమి,

శుక్రవారం 20 అగష్టు 1965

 

 శ్రీ కృష్ణ జన్మాష్టమికి శ్రీ సంస్థాన చరిత్రలోను శ్రీ సద్గురు సిద్ధరాజ్ మాణిక్ ప్రభు మహారాజుగారి జీవితంలోను ఒక ప్రత్యేకమైన మహత్యం ఉంది. ఈ రోజుకు సరిగ్గా 55 సంవత్సరాలకు పూర్వం జన్మాష్టమి నాడు జరిగిన ఒక అద్భుత సన్నివేశాన్ని తెలియజేస్తున్నాము. ఇది ప్రభుమహారాజ్ గారి శక్తిని, సద్గురువు మహిమయే కాక భక్తుని సామర్థ్యాన్ని కూడా తెలియజేసే ఒక అద్భుతమైన సంఘటన. అందువల్ల ఎవరి హృదయంలో భక్తితో కూడిన శ్రద్ధాసక్తులు ఉంటాయో వారు మాత్రమే ఈ కథను అర్థం చేసుకోగలరు. ఈ సంఘటన 1965 వ సంవత్సరంలో శ్రీ ప్రభువు యొక్క మహిమాన్విత గాదీపై శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు మహారాజుగారు  పీఠాధిపతులై ఉన్నప్పుడు జరిగినది. 1945వ సంవత్సరంలో శ్రీ శంకర్ మాణిక్ ప్రభు మహారాజ్ గారి సమాధి అయిన తరువాత 6 సంవత్సరాల వయస్సులోనే శ్రీ సిద్ధరాజ్ ప్రభుగారు శ్రీ సంస్థాన కార్యభారాన్ని తమ కోమలమైన హస్తాల్లోకి తీసుకున్నారు. ప్రస్తుత శ్రీ సంస్థానం యొక్క భవ్యమైన రూపం ఆ కోమలమైన చేతుల సామర్థ్యం యొక్క అద్భుత పరిణామమే. కేవలం 6 సంవత్సరాల వయస్సు లోనే ఏ విధమైన విధివిధానాలతో మంత్రదీక్షా, ఉపనయనం తమ తండ్రి (సద్గురువు) అయిన శ్రీశంకరమాణిక్ ప్రభువుల సమక్షంలో జరగలేదు. అలాంటి విపత్కర పరిస్థితులలో శ్రీజీగారు పీఠాధిపతులయ్యారు.

1965 వ సంవత్సరంలో శ్రావణ మాస మహోత్సవం మాణిక్ నగర్ లో ఉత్సాహంతో జరుపబడుతున్నది. ప్రతిరోజు శ్రీజీగారు శ్రీ ప్రభుమందిరంలో రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, సకలదేవతా దర్శనం, నిత్య భజన మొదలైన కార్యక్రమాల తరువాత ఇంటికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించేవారు. సాయం సంధ్యలో ప్రదోష పూజ తరువాత భోజనం పూర్తవడానికి ఒక్కోసారి రాత్రి 11-12 గంటలు అయ్యేది. శ్రీ కృష్ణ జన్మాష్టమి ముందురోజు రాత్రి శ్రీజీగారు ప్రదోష పూజ ముగించి భోజనం తరువాత తమ గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. మరుసటి రోజు అంటే శుక్రవారం 20 ఆగష్టు 1965 శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మ ముహుర్తంలో శ్రీజీ గారికి స్వప్నంలో శ్రీ శంకర్ మాణిక్ ప్రభు సాక్షాత్కరించి చెవులలో గురుమంత్రం ఉపదేశించారు. అక్కడితో ఆ స్వప్నం పూర్తయింది.

తేణే దయాలుత్వ ప్రగటవిలే | శ్రీ హస్త మస్తకీ ఠెవిలే|

గుహ్య జ్ఞాన ఉపదేశిలే | యా నిజ దాసా||

 ఆకాశంలో తూర్పున సూర్యోదయమవుతందనే సంకేతం ఇచ్చే ఎర్రని రంగు పరచుకున్నది. మాణిక్ నగర్ ఇంకా నిద్రావస్థలోనే ఉంది. కానీ శ్రీజీగారు సూర్యోదయం కోసం చూడలేదు. ఎందుకంటే సద్గురువు కృపా కటాక్షం అనే సూర్యోదయం వారికి అయింది. ఆ దివ్యానుభూతిని పొందిన శ్రీజీగారు కొన్ని క్షణాలు పరమానందభరితులయ్యారు. ఆ మంత్ర శబ్దం శ్రీజీగారి చెవులలో గింగురుమనసాగింది. వెంటనే శ్రీజీగారు స్నాన సంధ్యాదులు ముగించుకొని అప్పుడు ప్రభువు పూజ చేసే అర్చకులైన స్వ. పురుషోత్తమ్ శాస్త్రి గారిని పిలిచి స్వప్న విషయాన్ని తెలియజేశారు. శ్రీ పురుషోత్తమ్ శాస్త్రి గారు శ్రీ భీమ్ భట్, శ్రీ దత్త దీక్షిత్, శ్రీ గోవింద్ దీక్షిత్ మొదలైన పండితులతో చర్చించి శ్రీజీగారికి స్వప్నంలో ఇచ్చిన మంత్రాన్ని శ్రీ శంకర్ మాణిక్ ప్రభు సమాధి సమక్షంలో శాస్త్రోక్తంగా స్వీకరించడానికి ఏర్పాటు చేశారు. శ్రీ ప్రభువు శ్రావణ మాస మహాపూజ ముగించి శ్రీజీగారు శ్రీ శంకర్ మాణిక్ ప్రభు మందిరానికి వెళ్ళి అక్కడ సమాధికి పూజ చేసి స్వప్నంలో ప్రాప్తించిన మంత్రాన్ని సమాధి ముందు పఠించి తరువాత విధియుక్తంగా స్వీకరించారు. ఈ విధంగా మహారాజుగారిని జన్మాష్టమి పర్వదినం రోజున సద్గురువు శ్రీ శంకర్ మాణిక్ ప్రభువు మహారాజుగారు గురుమంత్రంతో అనుగ్రహించారు.

భక్తునిలో ఉన్న శ్రేష్టమైన గుణానికి ప్రభావితమై భగవంతుడు కూడా భక్తుని కోసం అసంభవాన్ని కూడా సంభవం చేసే పరిస్థితులకు లోనవుతాడు. భగవంతుడు స్వయంగా “అహం భక్త పరాధీన:” అని చెప్పి ఈ విషయాన్ని స్పష్టపరిచారు. గురుకృప యొక్క ఈ కథ మన హృదయాన్ని పునీతం చేస్తూ నిష్కామ భక్తియే భగవత్ ప్రాప్తికి సర్వోత్తమ మార్గమనే సందేశాన్ని ఇస్తుంది మరియు మనం ఈ మార్గాన్ని నిష్కామ పూర్వకంగా అనుసరించాలి.

 

గురు వాణి -1

ఒకప్పుడు ఒక రాజు ఉండిరి. ఆరాజు వద్ద మేలురకమైన ఒక గుర్రము ఉండెను. ఒకసారి రాజు తన గుర్రంపై రాజ్యంలో షికారు చేయడానికి బయలుదేరారు. గుర్రంపై వెళ్తున్న రాజుగారిని చూడడానికి రాజ్యంలోని ప్రజలు రాజమార్గానికి ఇరువైపులా నిలబడ్డారు. రాజుగారు గుర్రంపై వస్తుండగా జనం వంగి వంగి నమస్కారం చేయసాగిరి. రాజుగారు పట్టణంలోని ఇంకోవైపుకు వెళ్ళగానే గుర్రం అనుకోకుండా ఆగిపోయింది. రాజుగారు అనేక విధాలుగా ప్రయత్నం చేసినా ఆగుర్రం కొద్దిగా కూడా కదలలేదు, రాజుగారు చర్నాకోలతో కొట్టినడిపే ప్రయత్నం చేసినా కూడా ఆ గుర్రం కదలకుండా సిలబడిపోయింది. చివరికి రాజుగారు విసిగిపోయి గుర్రాన్ని ఇలా అడిగారు – ” ఏమిటి విషయం, నీవు ఎందుకు ముందుకు కదలడం లేదు?” అని! గుర్రానికి రాజుగారి భాష, తెలిసేది, రాజుగారికి కూడా గుర్రం భాష, అర్థమయ్యేది. గుర్రం రాజుగారితో మీరు ముందుగా నా వీపుపై నుండి దిగండి చెపుతాను అంది. రాజు గుర్రంపై నుండి దిగగానే గుర్రం ఇలా అంది – “ఈ రోజు నుండి మీరు నాపై సవారి చేయకూడదు” అని. రాజుగారికి గుర్రం మాటలు విని ఆశ్చర్యం కలిగి – “ఎందుకు, ఏమయింది?” అని అడిగారు. గుర్రం చిరాకు పడి “చూశారు కదా, నగరంలోని జనం వంగి వంగి నాకు ఎలా నమస్కారం చేయసాగారో, నగరంలోని జనం నన్ను ఇంత గౌరవిస్తుంటే, వారి ముందు మీరునాపై సవారి చేస్తే నా మర్యాద మట్టిలో కలిసిపోతుంది. అందుకని ఈ రోజు నుండి మీరు నాపై సవారి చేయకూడదు” అన్న గురం యొక్క ఈ మాటలు విని రాజగారు విచారంగా ఉండిపోయారు.

ఈ శరీరం గుర్రం. ‘దానిపై ఆత్మ రాజు వలె సవారి చేస్తుంది. మనం అనుభవించే మర్యాద, సన్మానం, యశస్సు, కీర్తి, వైభవం, సమృద్ధి మొదలైనవన్నీ ఆత్మ చైతన్యం కారణంగా కలుగుతాయి.కానీ దేహం-మనస్సు-బుద్ధి యొక్క సమూహానికి ఈ మర్యాద, సన్మానం, యశస్సు, కీర్తి, వైభవం, సమృద్ధి మొదలైనవన్నీ నా వల్లనే అనే భ్రమ కలుగుతుంది. అందువల్లనే దేహం మొదలైన ఆనాత్మ సమూహం కూడా రాజు యొక్క గుర్రం వలె వ్యర్థ అభిమానంతో కూడి ఉంటుంది. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి ఉపదేశిస్తూ ఇలా చెప్పారు – “ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు బుద్ధిం తు సారథిం విద్ధి మన: ప్రగ్రహమేవ చ| ఇంద్రియాణి హయానాహు: విషయాస్తేషు గోచరాన్ | ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తే త్యాహుర్మనీషిణః” జీవాత్మ రథానికి స్వామి అయి ఉన్నది, ఈ శరీరం రథం అయి ఉన్నది, బుద్ధి ఈ రథానికి సారథి మరియు మనస్సు కళ్లేము అని తెలుసుకో. ఇంద్రియాలే గుర్రం మరియు ఇంద్రియ గోచర విషయాలేవాటి మార్గం, దానిపైనే ఇంద్రియరూప గుర్రం పరిగెత్తుతుంది. శరీరం, ఇంద్రియాలు మరియు మనస్సుతో కూడిన జీవాత్మనే విద్వజ్జనులు భోక్తా అంటారు.

ఇంద్రియాల దుష్ట ఆశ్వానికి మనస్సు అనే కళ్లెంతో బుద్ధి ఎప్పుడేతే తన వశం చేసుకుంటుందో అప్పుడే ఈ శరీర రూప రథం సరైన దిశలో – నడుస్తుంది, లేకపోతే దుర్ఘటన నిశ్చయం. ఇంద్రియ రూప గుర్రం ఒక వేళ స్వతంత్రంగా వ్యవహరిస్తే రథం మరియు సారథి ఇద్దరూ గుంతలోకెళ్ళి పడతారు. అందువల్ల మనం మన ఇంద్రియాలను బుద్ధిరూపసారథికి అప్పగించాల్సిన ఆవశ్యకత ఉంది. దీంతో పాటు మనం గుర్తుంచుకోవలిసిన విషయం ఏమిటంటే నేను రథాన్ని కాదు, నేను సారథిని కాదు, నేను కళ్ళాన్ని కాదు మరియు గుర్రం కూడా కాదు.నేను వీటన్నిటి స్వామి అయిన ఆత్మరూప రథాన్ని అని. అందువల్ల నేను ఇంతకు ముందు ఒక కవితలో (గజల్) ఇలా వ్రాశాను – “జో బీ హి ఆన్ బాన్ శాన్ జ్ఞాన్ కీయహా| వాకయీ మే హైవో ఆపకీ బందా గరీబ్ హై” జడశరీరం మరియు చేతన ఆత్మ యొక్క ఈ వివేకం మీ అందరికి ప్రభు కృపతో ప్రాప్తించాలని, మంగళ ఆశీస్సులు ఇస్తున్నాను.

గాదీ అష్టమి మహత్యం

శ్రీ సంస్థానంలో గాదీ అష్టమి పండుగకు ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. ఈ పండుగ యొక్క ఇతిహాసం శ్రీ మార్తండ మాణిక్‌ప్రభు జీవితంలోని అత్యంత మహత్తరమైన సంఘటనతో ముడిపడి ఉంది.

1916 వ సంవత్సరంలో శ్రీ ప్రభువు యొక్క మహిమాన్వితమైన  సింహాసనంపై శ్రీ మార్తండ మాణిక్ ప్రభువు ఆసీనులై ఉండిరి. ప్రస్తుతం వారి సమాధి మందిరం ఉన్న ప్రదేశంలోని ఔదుంబర వృక్షఛాయలో ఆ సమయంలో శ్రీజీగారి పూజగది ఉండేది.  ఉత్తరాభిముఖంగా ఉన్న  ఆ గదిలో శ్రీజీగారు ప్రతినిత్యం అనుష్టానం చేసేవారు. శ్రీజీగారు చివరివరకు  క్రమంతప్పకుండా నిత్యపూజ చేసేవారు. తమ జీవితంలోని చివరి క్షణాలలో కూడా శ్రీజీగారు మంచంపై పడుకొనే తమ నిత్యానుష్టానం చేసేవారని చెపుతారు.

నలనామ సంవత్సరం – సోమవారం 7 అగష్టు 1916 – శ్రావణ శుక్ల అష్టమి రోజు మధ్యాహ్నం శ్రీజీగారు తమ పూజగదిలో అనుష్టానం చేస్తున్నారు. సత్పురుషుల పూజా పద్ధతి మన పూజా పద్ధతికి భిన్నంగా ఉంటుంది. శ్రీజీగారు తమ ఒక పదరచనలో ఇలా అన్నారు. “షట్చక్ర అర్చనా పాత్ర సుదీక్షా మంత్ర హర్ష మధుధారా సర్వాత్మ శక్తి లయ శుద్ధ శాంభవీ ముద్రా॥’’ (హే మహా త్రిపురసుందరీ దేవీ నేను నీ అర్చన మధుధార మొదలైన ఆరు ధారలను చక్రరూపమైన పాత్రల ద్వారా చేస్తాను, నా సద్గురువు ద్వారా దీక్ష తీసుకున్న మంత్ర జపంతో కలిగే హర్షాతిరేకంతో మధుధార నా సమస్త శరీరంలో స్రవిస్తుంది. శాంభవీ ముద్రతో నా సమస్త భావాలు మీ సర్వాత్మ శక్తి స్వరూపంలో లీనమవుతాయి.) ఆ సమయంలో ఇలాంటి దైవారాధనలో శ్రీజీగారు నిమగ్నమయ్యారు. పసుపు, కుంకుమ, గంధం, పుష్పం, ధూపం మరియు దీపంతో శ్రీ ప్రభువు ఆరాధన చేసిన తరువాత తమ మనసు-బుద్ధిని నైవేద్యం  రూపంలో సమర్పించి శ్రీజీగారు ఆత్మజ్యోతితో శ్రీ ప్రభువు యొక్క హారతిని ముగించారు. నమస్కారం చేయడానికి శ్రీజీగారు వంగగానే అక్కడ దేదీప్యమానమైన ఒక తేజఃపుజం కనపడింది. గీతలో భగవంతుని విశ్వరూప దర్శనం సంజయుడు ఇలా వర్ణించాడు – “దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుథ్తితా యదీ భా: సద్రుశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః॥’’ (ఒకవేళ ఆకాశంలో వేల సూర్యులు ఒకేసారీ ఉదయించినా కూడా ఆ ప్రకాశం ఈ ప్రభువు యొక్క తేజః పుంజానికి సరితూగదు) ఆ ప్రకాశంతో సాక్షాత్ శ్రీమాణిక్‌ప్రభుమహారాజుగారు సగుణరూపంలో ఏ ప్రదేశంలో అయితే శ్రీజీగారి సమక్షంలో ప్రత్యక్షమయ్యారో ఆ ప్రదేశంలో శ్రావణ శుక్ల అష్టమి రోజు శ్రీ ప్రభువు యొక్క సగుణ సాకారరూప దర్శనమయింది.

శ్రీప్రభువు మరియు శ్రీజీగారి మధ్య జరిగిన సంభాషణ మరియు ప్రభువు ఏ రూపంలో ప్రత్యక్షమయ్యారో మాకు వివరాలు తెలియవు కానీ “ఝాలో అమ్హి బహు ధన్యరే భేటలే సగుణ హే బ్రహ్మరే॥’’  సగుణ బ్రహ్మ దర్శనం వల్ల మేము ధన్యులమయ్యామనే అనుభూతి మాత్రం కలిగిందని తప్పకుండా చెప్పవచ్చు. తమ అనేక రచనలలో శ్రీ ప్రభువు యొక్క  సగుణరూప సాక్షాత్కా రాన్ని శ్రీజీగారు ఎలా వర్ణించారో అవన్నీ కూడా ఈ దివ్యానుభూతితో కూడి ఉన్నాయి.

శ్రీజీగారికి ఏ స్థానంలో శ్రీ ప్రభువు దర్శనమయిందో అక్కడ ఆ రోజే శ్రీ ప్రభువు యొక్క  గాదీ(పీఠం) స్థాపించారు. అందువల్ల శ్రావణ శుక్ల అష్టమిని శ్రీ సంస్థానంలో “గాదీఅష్టమి’’ అంటారు.

ఈ ఘటన తరువాత శ్రీజీగారి శిష్యులు వారితో శ్రీ ప్రభువు యొక్క సగుణ స్వరూప దర్శన అనుభవం యొక్క వర్ణన చేయవలసిందిగా వేడుకున్నప్పుడు శ్రీజీగారు “పూర్ణకృపే కృపా బోలవేనా॥ అనుభవే అనుభవ హీ సాహీనా బోధే బోద జాహలీ కల్పనా మృత్యు పావలీ స్ఫూర్తీ వాసనా॥’’ శ్రీజీగారు తమ శిష్యబృందానికి వివరిస్తూ ఇలా చెప్పారు. నా సద్గురువుకు నాపై పూర్ణకృప కలిగింది మరియు ఆ కృపానుభవాన్ని మాటలతో వ్యక్తపరచడం అసాధ్యం ఎందుకంటే ప్రభువును అనుభవంతోనే తెలుసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే వారే అనుభవరూపులు. అందువల్ల నేను ఆ అనుభవాన్ని వర్ణించలేను. అత్మబోధ యొక్క జ్వాల నా సమస్త కల్పనలను భస్మం చేసింది. ఇప్పుడు నేను ఆ అనుభవాన్ని కల్పన కూడా చేయలేను అందువల్ల నేను మౌనం వహించవలసి వస్తున్నది.

1916వ సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతిసంవత్సరం శ్రావణశుక్ల అష్టమి తిథి రోజు శ్రీ సంస్థానంలో గాదీఅష్టమి పండుగగా జరుపబడుతుంది. ఈ సందర్భంగా శ్రీ మార్తండ మాణిక్‌ప్రభు మహారాజుగారి సమాధికి మహాపూజ మరియు వారిచే స్థాపించబడిన గాదీకి కూడా పూజ చేయబడుతుంది. ఆ పరమ పవిత్రమైన రోజును స్మరిస్తూ మనం ప్రేరితమై ఎల్లప్పుడూ మన అధ్యాత్మిక సాధన దృఢం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కృప కావాలనే అభిలాషతో పూర్ణకృప పొందిన ఈ కథను మనన చేసే సద్భక్తులపై శ్రీ ప్రభువు యొక్క పూర్ణకృప తప్పకుండా కలుగుతుందనడంలో ఆవగింజంత కూడా సందేహం లేదు.